న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో దేశ రాజధానిలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దవాఖానల్లో పడకల కొరతలు, ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ కొరత ఢిల్లీని వేధిస్తోంది. ఇక కరోనా మహమ్మారితో ఆదివారం ఒక్కరోజే 350 మంది మరణించగా 22,933 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలతో ఢిల్లీలోని స్మశానాలు బాధితుల మృతదేహాలతో కిక్కిరిశాయి. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు తమ ఆప్తుల అంత్యక్రియల కోసం వేచిచూడాల్సి వస్తోంది.
రోజూ కరోనా రోగుల మృతదేహాలు తరలివస్తుండటంతో ఢిల్లీలోని స్మశానాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. స్మశానాల్లో ఖాళీ లేక పార్కులు, పార్కింగ్ సదుపాయాలు, ఖాళీ స్థలాల్లోనూ కొవిడ్-19 రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సరై కలే ఖాన్ స్మశానంలో కొత్తగా 50 ప్లాట్ ఫాంలు నిర్మించగా ఢిల్లీలోని రెండో అతిపెద్ద స్మశానం పంజాబిబాగ్ లోని క్రిమేషన్ ను కేవలం కరోనా వైరస్ రోగులకే కేటాయించారు. ఇక ఘజీపూర్, వజీరాబాద్ లోని స్మశానాల్లోనూ కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు పదుల సంఖ్యలో అదనపు ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేశారు.