జైనూర్, ఏప్రిల్ 20: కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సాయన్న హెచ్చరించారు. మండలకేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసుల నమోదుతో పాటు జరిమానా విధిస్తామన్నారు. అదేవిధంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్రావ్, ఎస్ఐ తిరుపతి, ఎంపీడీవో ప్రభుదయా, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీ, సర్పంచ్ పార్వతీ లక్ష్మణ్, ఈవో శంకర్, వ్యాపారులు, ప్రజలు ఉన్నారు.
కెరమెరి, ఏప్రిల్ 20 : మండలకేంద్రంలో ఏఎస్ఐ స్వామి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, రాత్రి 8 గంటలకు దుకాణాలు మూసివేయాలన్నారు. పాటించని వారికి జరిమానాతో పాటు చర్యలు తప్పవని హెచ్చరించారు.
కౌటాల రూరల్, ఏప్రిల్ 20 : మండలంలోని మొగఢ్దగఢ్ గ్రామంలో తహసీల్దార్ మునావర్ షరీఫ్ గ్రామస్తులకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. మాస్కులు ధరించాలని సూచించారు. సర్పంచ్ ఉర్వత్ జిజాబాయి పాల్గొన్నారు.
కాగజ్నగర్టౌన్, ఏప్రిల్ 20 : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కొవిడ్ వ్యాక్సిన్, కరోనా నిర్ధారణ పరీక్షలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ ప్రమోద్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డాక్టర్ అశ్విని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో వార్డుల్లో 45 ఏళ్లు దాటిన వారందరినీ గుర్తించి వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. ప్రతి రోజూ ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తప్పనిసరిగా 150 మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలందరూ మాస్కులు విధిగా ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
కౌటాల, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ నివారణకు గ్రామాల్లో కార్యదర్శులు, సర్పంచ్లు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎంపీవో శ్రీధర్ రాజ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ వాడల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, వాటర్ ట్యాంక్లు, డ్రైనేజీలు శుభ్రం చేయాలన్నారు. సెకండ్ వేవ్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. అర్హులందరూ టీకా వేసుకునేలా చూడాలన్నారు. పంచాయతీ సిబ్బంది, ఉన్నారు.
లింగాపూర్, ఏప్రిల్ 20 : మాస్కు ధరించకుండా తిరిగితే జరిమానా విధిస్తామని ఎస్ఐ మధుకర్ హెచ్చరించారు. మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టి మాట్లాడారు. ఏఎస్ఐ రామరావ్, పోలీసులు పాల్గొన్నారు.