ముంబై : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంటే పలువురు కొవిడ్-19 మార్గదర్శకాలను గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఓ నేరగాడి అంత్యక్రియలకు 200 మంది హాజరు కావడం కలకలం రేపింది. వీరిలో 80 మందిని అదుపులోకి తీసుకున్న పుణే పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో 15 బైక్ లను పోలీసులు సీజ్ చేశారు. బిబ్బేవాడి ప్రాంతంలో శనివారం క్రిమినల్ మాధవ్ వగ్వాటేను దుండగులు హతమార్చారు.
అయితే మాధవ్ అంత్యక్రియల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. 200 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 80 మందిని ఇప్పటివరకూ అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో నిబంధనలు ఉల్లంఘించి పాల్గొనడంతో పాటు భారీగా గుమికూడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పుణే పోలీసులు 15 టీమ్ లను ఏర్పాటు చేశారు.