కంటోన్మెంట్, మే 1: కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన గొప్ప రోజు మేడే అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మేడే సందర్భంగా బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగంతో పాటు టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ నావ నడకకు ఇంధనం లాంటిదని కొనియాడారు.
కార్మికులకు ఏ సమయంలోనైనా.. ఏ అవసరం ఉన్నా తనకు చేతనైన సహాయం తక్షణం చేస్తానన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని, కొవిడ్ కారణంగా మేడే ఘనంగా నిర్వహించలేక పోతున్నందున కొంత బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీగణేశ్, టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్ కుమార్, టాక్సీ సెక్టార్ విభాగం నాయకులు వీరయ్య, ఫాహీముద్దీన్, నరేందర్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, రాజు, నాజీర్ పాల్గొన్నారు.