న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్. సోధి వెల్లడించారు. ఆవు, బర్రె పాలతో పాటు గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటి ధరలు పెరగనున్నాయని చెప్పారు.
ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ప్యాకేజింగ్ ఖర్చు 30 నుంచి 40 శాతం వరకూ భారమవడంతో పాల ధరల పెంపు అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రవాణా వ్యయం 30 శాతం ఎగబాకిందని అన్నారు. అమూల్ బ్రాండ్పై జీసీఎంఎంఎఫ్ వెన్న, మీగడ, ఐస్క్రీం వంటి ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది.