గువహటి: అస్సాంలో 18 ఏనుగులు మరణించాయి. పిడుగుపాటు వల్ల ఇవి చనిపోయి ఉంటాయని అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు. నాగాన్-కర్బి ఆంగ్లాంగ్ జిల్లా సరిహద్దులోని కొండ ప్రాంతంలో 18 ఏనుగులు మరణించి ఉండటాన్ని గురువారం గుర్తించినట్లు అస్సాం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) అమిత్ సాహే తెలిపారు. ప్రతిపాదిత కాతియాటోలి పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని కుండోలి ప్రాంతంలో ఇవి చనిపోయాయని చెప్పారు. ఒక చోట 14 ఏనుగులు, మరో చోట 4 ఏనుగుల మృతదేహాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారని, వీటి మరణానికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
మరోవైపు 18 ఏనుగులు పిడుగుపాటుకు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అటవీ మంత్రి పరిమల్ సుక్లబైద్యా తెలిపారు. పోస్ట్మార్టం తర్వాత మాత్రమే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. తాను శుక్రవారం సంఘటన ప్రాంతాలను సందర్శిస్తానని ఆయన వెల్లడించారు.