నోయిడా: మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నోయిడాలోని సెక్టార్ 110కు చెందిన ఏడో తరగతి చదువుతున్న ఓ 15 ఏండ్ల బాలుడు నిత్యం ఫోన్లో ఆటలాడుతూ ఉన్నాడు. ఎప్పుడూ ఫోన్లోనే ఆటలా అని అతని తల్లిదండ్రులు బుధవారం రాత్రి మందలించారు. దీంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు.
అతనికోసం రాత్రంతా వెతికిన తల్లిదండ్రులు.. గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అతనికోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతని ఇంటి సమీపంలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. తల్లిదండ్రులు మందలించడంతో భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.
కాగా, నోయిడాలో బుధవారం రోజున ఇలాంటివే మరో ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..