లక్నో : అబ్బాయితో మాట్లాడొద్దన్నందుకు ఓ 15 ఏండ్ల బాలిక తన తమ్ముడిని చంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో గత గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. దాల్మౌ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నిరంతరం ఫోన్లోనే మాట్లాడుతోంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఓ అబ్బాయితో గంటల పాటు చాట్ చేస్తూ మాట్లాడుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన తమ్ముడు(9) సోదరిని మందలించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన సోదరి.. తమ్ముడిని ఇయర్ఫోన్ వైర్ను గొంతుకు బిగించి చంపేసింది. ఆ తర్వాత స్టోర్రూమ్లో డెడ్ బాడీని దాచిపెట్టింది.
తమ కుమారుడిని పక్కింటి వ్యక్తి హత్య చేశాడంటూ.. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కింటి వ్యక్తిని విచారించారు. అతను నేరానికి పాల్పడలేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ రోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు ఇతరులను విచారించారు. సోదరి కడుపు, మెడపై గాయాలను గుర్తించారు. మృతదేహాంపై కూడా గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు తమ విచారణలో తేలింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. అబ్బాయితో మాట్లాడొద్దన్నందుకే తమ్ముడిని హత్య చేశానని తెలిపింది. అతన్ని చంపాలనే ఉద్దేశం లేదు కానీ.. అమ్మనాన్నకు చెప్తాడేమోననే భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె చెప్పింది. నిందితురాలిని జువైనల్ హోమ్కు పోలీసులు తరలించారు.