జేఎన్టీయూ అధికారుల యోచన
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బీటెక్ 8వ సెమిస్టర్ విద్యార్థులకు నిర్వహించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, అనేక పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలా అన్న అంశంపై అధికారులు సమాలోచనలు జరపుతున్నారు. గతేడాది విద్యార్థులకు సమీపంలోని కాలేజీల్లో పరీక్షలు రాసుకొనే వెసులుబాటును కల్పించారు. ఇలా పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశమిచ్చి, సెమిస్టర్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు. ఈసారి కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో పరీక్షాకేంద్రాల్లో నిర్వహించడం అంత శ్రేయస్కరంకాదన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఇదే క్రమంలో ఆన్లైన్ పరీక్షల నిర్వహణపై దృష్టిసారించారు. బీటెక్ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ పరీక్షలు కావడం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, జూన్, జూలై మాసాల్లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నదని.. జూన్, జూలై మాసాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూరు హస్సేన్ తెలిపారు.
కరోనా నేపథ్యంలో అధ్యాపకులంతా ఇంటి నుంచే పాఠాలు బోధించేందుకు అవకాశం కల్పిస్తూ జేఎన్టీయూ ఉత్తర్వులు జారీచేసింది. యూజీ, పీజీ కోర్సుల్లో అధ్యాపకులంతా ఇంటి నుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హస్సేన్ సర్కులర్ జారీచేశారు. అటానమస్, గుర్తింపు పొందిన, ఇతర కాలేజీలన్నీ ఉత్తర్వులను పాటిస్తూ షెడ్యూల్ ప్రకారం తరగతులను నిర్వహించాలని తెలిపారు. అధ్యాపకులను కాలేజీకి రావాలని ఇబ్బంది పెట్టవద్దని యాజమాన్యాలకు ఆయన సూచించారు.