హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాత్రివేళ కర్ఫ్యూను మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కరోనాపై దాఖలైన పిటిష్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సలహా కమిటీ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. దీనిపై అసంతృప్తి వ్యక్తంచేసిన కోర్టు.. 45 నిమిషాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలని, లేనిపక్షంలో తామే ఉత్తర్వులు జారీచేయాల్సి వస్తుందని చెప్పింది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు, ఏప్రిల్ ఒకటి నుంచి 25 వరకు 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్టు ఏజీ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.5 శాతం మాత్రమే ఉన్నదని తెలిపారు. రాష్ర్టానికి కేంద్రం 430 టన్నుల ఆక్సిజన్ను కేటాయించిందని, దీన్ని 600 టన్నులకు పెంచాలని కోరామని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఏజీ చెప్పారు. మినీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు మద్యం అందుబాటులో ఉండకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాపై దాఖలైన పిల్స్పై విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టుల స్టే అమలు పొడిగింపు
కరోనా మహమ్మారి రెండోదశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యలో వివిధ కోర్టుల స్టే ఉత్తర్వుల అమలును పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు, జిల్లా కోర్టులు, ఇతర సబార్డినేట్ కోర్టులు గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలును జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రాంచంద్రరావు, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డిలతో కూడిన పుల్కోర్టు నిర్ణయం తీసుకుంది.