బెంగళూరు: బంగ్లాదేశ్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన 22 ఏండ్ల మహిళను ఒక ముఠా ఆ దేశం నుంచి భారత్కు అక్రమంగా తరలించింది. ఆమెను పలు రాష్ట్రాలకు తిప్పిన ఆ ముఠా చివరకు కర్ణాటకలోని బెంగళూరుకు తీసుకొచ్చింది. అక్కడ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. అయితే వారి మధ్య ఆర్థిక విభేదాలు రావడంతో ఆ మహిళను క్రూరంగా హింసించడంతోపాటు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో బాటిల్ను చొప్పించి పైశాచిక ఆనందం పొందారు. మే నెలలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కాగా, బెంగళూరు పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని దర్యాప్తు చేశారని పోలీస్ కమిషనర్ కమల్ పంత్ గురువారం ట్వీట్ చేశారు. ఐదు వారాల్లో దర్యాప్తు పూర్తయిందని, 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, 11 మంది బంగ్లాదేశ్ జాతీయులని వివరించారు. 1,019 పేజీల చార్జ్షీట్ను కోర్టుకు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. దర్యాప్తు బృందాన్ని అభినందించిన పోలీస్ కమిషనర్ కమల్ పంత్, రూ.లక్ష రివార్డుగా ప్రకటించారు.
మరోవైపు అరెస్ట్, దర్యాప్తు సందర్భంగా నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు నిందితులు గాయపడ్డారు.