తిరువనంతపురం : టీవీ ( television ) లో ఛానెల్ మార్పు విషయంలో జరిగిన వివాదం ఓ బాలిక నిండు ప్రాణాలు బలి తీసుకున్నది. కేరళ ఇడుక్కిలోని మనక్కాడ్లో సోమవారం.. ఓ 11 ఏండ్ల బాలిక తన సోదరి, కజిన్తో కలిసి ఇంట్లోనే టీవీ చూస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేరు. అయితే ఛానెల్ మార్పు విషయంలో ఈ ముగ్గురి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. ఇంట్లోనే కిటికీ గ్రిల్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలికను గమనించిన నానమ్మ తక్షణమే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న బాలిక ఆరో తరగతి చదువుతోంది. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.