నోయిడా: డబ్బులు డిమాండ్ చేసేందుకు బాలుడ్ని కిడ్నాప్ చేసిన బంధువులు అనంతరం ఈ విషయం తెలిసిపోతుందన్న భయంతో గొంతు నులిమి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల అభిషేక్ను బాబాయ్ వరుసయ్యే మనోజ్ కుమారుడు కునాల్ వీడియో గేమ్స్ ఆడుకుందాంటూ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. రషీద్ అలీ అనే వ్యక్తితో కలిసి ఉన్న తండ్రి మనోజ్కు అతడ్ని అప్పగించాడు. అభిషేక్ను కిడ్నాప్ చేసి అతడి కుటుంబం నుంచి పది లక్షలు డిమాండ్ చేయాలని వారు ప్లాన్ చేశారు.
ఈ విషయాన్ని గ్రహించిన అభిషేక్ సహాయం కోసం కేకలు వేశాడు. అయితే ఇంట్లో గొడవగా భావించిన స్థానికులు పట్టించుకోలేదు. మరోవైపు తమ గురించి తెలిసిపోతుందన్న భయంతో బాలుడ్ని చంపాలనుకున్నారు. అభిషేక్ గొంతునొక్కి కునాల్ చంపేశాడు. అనంతరం సెక్టార్ 62 వద్ద డ్రైన్లో మృతదేహాన్ని పడేశాడు.
మరోవైపు అభిషేక్ కనిపించకపోవడంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు కునాల్, అతడి తండ్రి మనోజ్ను అరెస్ట్ చేశారు. అభిషేక్ను తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వారు చెప్పిన వివరాలతో డ్రైన్లో పడేసిన అభిషేక్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బంధువులైన కునాల్, మనోజ్పై హత్య, కిడ్నాప్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.