భోపాల్: ఇంటికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెను ఒక తండ్రి దారుణంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఈ ఘటన జరిగింది. ఉత్తమ్పురా ప్రాంతానికి చెందిన 10 ఏండ్ల బాలిక ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి నవరాత్రి నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లింది. స్థానికంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద తోటి పిల్లలతో కలిసి ఆడుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది.
మద్యం సేవించి ఉన్న 40 ఏండ్ల బాలిక తండ్రి రాకేష్ జాతవ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చిందన్న కోపంతో ఆమెను కర్రతో పదే పదే కొట్టాడు. దీంతో దెబ్బలు తాళలేక ఆ బాలిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి వచ్చారు. కుమార్తె మరణానికి కారణమైన తండ్రిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆశిష్ రాజ్పుత్ తెలిపారు.