చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర హోం, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మీడియాకు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆదివారం హర్యానాలో రికార్డు స్థాయిలో 3,440 కరోనా కేసులు 16 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,881కు, మరణాల సంఖ్య 3,268కు పెరిగింది.