భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఘటనలో మరికొందరు గాయపడ్డగా.. వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. ఆటో గ్వాలియర్ నుంచి మోరెనా రోడ్ వైపు చమన్ పార్క్ వైపు వెళ్తుండగా.. ఆటో బస్సును వేగంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో వంట చేసే మహిళలు తిరిగి ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించిందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మహిళలు, ఆటో డ్రైవర్ మృతి చెందారని, మిగతా వారంతా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జవగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.4లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.