కావలసిన పదార్థాలు:
ఇడ్లి రవ్వ: 2 కప్పులు, సగ్గు బియ్యం: 1 కప్పు, పెరుగు: 2 కప్పులు, క్యారెట్ తురుము: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, పచ్చి కొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, ఆవాలు, జీలకర్ర, మినుపపప్పు, శనగపప్పు: అర టీ స్పూన్ చొప్పున, కరివేపాకు: ఒక రెమ్మ, కొత్తిమీర: కొద్దిగా, నూనె: సరిపడా
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఇడ్లి రవ్వ, సగ్గుబియ్యం కలిపి పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ‘ఇడ్లిపిండి’లా కలిపి, ఆరు గంటలు నాననివ్వాలి. బాగా నానిన పిండిలో తగినంత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపట లాడాక మినుపపప్పు, శనగపప్పు వేసి కొంచెం వేగగానే పిండిలో వేసి కలపాలి. నూనె రాసిన ఇడ్లి ప్లేట్లలో గరిటెతో సగ్గు బియ్యం మిశ్రమం వేసి ఆవిరిమీద ఉడికించాలి. ఇడ్లీలు మెత్తగా మధ్య మధ్యలో సగ్గుబియ్యం మెరుస్తూ కనిపిస్తాయి. సగ్గు బియ్యం ఇడ్లీలు చట్నీ లేదా సాంబారుతో బాగుంటాయి.