కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్: రెండు కప్పులు, పచ్చిమామిడి: ఒకటి, జీలకర్ర: అర టీస్పూన్, దాల్చిన చెక్క: చిన్నముక్క, యాలకులు: నాలుగు, లవంగాలు: నాలుగు, మిరియాలు: పావు టీస్పూన్, నెయ్యి: రెండు టీస్పూన్లు, పసుపు: అర టీస్పూన్, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: చిన్నముక్క, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం: ముందుగా బాస్మతి రైస్ని బాగా కడిగి, రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. మామిడికాయని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్మీద కుక్కర్ పెట్టి నెయ్యివేసి వేడయ్యాక జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి నిమిషంపాటు వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే మామిడి తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి.. నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా వేసి కలపాలి. మూడుకప్పుల నీళ్లుపోసి కలిపి కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఐదునిమిషాల తర్వాత కుక్కర్ మూతతీసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులావ్ రెడీ.