కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, చింతపండు: నిమ్మకాయంత, పల్లీలు: ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు, పసుపు: అర టీస్పూన్, ఎండు మిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: మూడు, మిరియాలు: పది, ఆవాలు, జీలకర్ర: ఒక టీస్పూన్, మినుప పప్పు, శనగ పప్పు: రెండు టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి.. నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మినుప పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక పసుపు జోడించి, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి దగ్గర పడేవరకు ఉడికించాలి. చింతపండుకు బదులు నిమ్మ, మామిడి, ఉసిరి తురుము కూడా వేసుకోవచ్చు. పులుసు బాగా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు.. దింపుకొని తగినంత ఉప్పు, ముందుగా వండిన అన్నం వేసి బాగా కలిపితే సింహవాహినికి ఇష్టమైన పులిహోర సిద్ధం.