శ్రీరామనవమి రోజున రాములవారికి కచ్చితంగా వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెడతారు. వేసవి కాలంలోనే ఈ పండుగ వస్తుంది కాబట్టి, ఆరోజు పెట్టే ప్రసాదాల్లో వేడిని తగ్గించే పదార్థాలే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి చలువ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వడపప్పు
కావాల్సినవి : పెసరపప్పు: ముప్పావు కప్పు, బెల్లం తురుము: పావు కప్పు, మామిడికాయ: ఒకటి, పచ్చికొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ముందుగా పెసరపప్పును రెండుసార్లు కడిగి, రెండు కప్పుల నీళ్లలో గంటసేపు నానబెట్టాలి. తర్వాత ఆ పప్పును వడగట్టి కొద్దిసేపు ఆరబెట్టాలి. మరోవైపు
మామిడికాయ తొక్కతీసి తురమాలి. దాంట్లోంచి మూడు టేబుల్ స్పూన్ల మామిడికాయ తురుమును ఒక గిన్నెలో వేయాలి. అందులోనే పెసరపప్పు, బెల్లం తురుము, పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వడపప్పు రెడీ.
పానకం
కావాల్సినవి: బెల్లం: ముప్పావు కప్పు, నీళ్లు: మూడు గ్లాసులు, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, శొంఠి పొడి: అర టీ స్పూన్, మిరియాల పొడి: చిటికెడు, ఇలాచీ పొడి: చిటికెడు
తయారీ : ముందుగా బెల్లాన్ని నీళ్లలో వేసి కరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నిమ్మరసం, శొంఠి పొడి, మిరియాల పొడి, ఇలాచీ పొడి వేసి కలపాలి. భక్తితో తీసుకునే ఈ పానకం శరీరంలోని వేడిని తగ్గిస్తూ, రోగ నిరోధక శక్తిని
పెంచుతుంది.