హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు. కులవృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణుల కోసం 250 యూని ట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పథకంలో మార్పులు, చేర్పులు చేయాలని కులసంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు ఆయా సంఘాల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నట్టు గంగుల వెల్లడించారు. 17 ఉపకులాలను బీసీల్లో చేర్చటమే కాకుండా బీసీ రిజర్వేషన్లను మరో పదేండ్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టంచేశారు.