పద్మభూషణ్ ఓ ఔత్సాహిక రచయిత. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులేమిటో తెలియాలంటే మా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్. ఆయన నిర్దేశకత్వంలో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అనురాగ్, శరత్, చంద్రుమనోహర్ నిర్మిస్తున్నారు. అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో సుహాస్ తండ్రిగా ఆశిష్విద్యార్థి, తల్లి పాత్రలో రోహిణి నటిస్తున్నారు. చక్కటి హాస్యంతో అందరిని మెప్పిస్తుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి, నిర్మాణ సంస్థ: ఛాయ్ బిస్కట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్.