మైలార్దేవ్పల్లి, మే 29: కరోనాతో తల్లి మృతి చెందింది.. అమ్మలేని జీవితం వ్యర్థం అంటూ మనస్తాపానికి గురైన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తన తల్లికి దవాఖానలో ఖర్చు కోసం స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు తెచ్చామని.. ఇల్లు అమ్మి ఆ అప్పులు తీర్చాలని స్నేహితులను కోరాడు. ఈ విషాద ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్, మధుబన్ కాలనీకి చెందిన జెల్ల రాంచందర్ పోలీసు రిటైర్డ్ ఉద్యోగి. అతనికి భార్య రుక్మిణి(50), కొడుకు శ్రీహరి(22) ఉన్నారు. శ్రీహరి నిజాం డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదివాడు. రాంచందర్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. కాగా..గత 20 రోజుల క్రితం తల్లికి కరోనా సోకడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. వైద్యం కోసం స్నేహితులు, బంధువుల వద్ద రూ.10 లక్షల వరకు అప్పు తెచ్చి దవాఖానలో చెల్లించాడు.
చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తల్లి మృతి చెందింది. 10 లక్షలు ఖర్చు చేసినా తల్లి బతకకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీహరి ఇంటికి వెళ్లి ఆక్టీవా వాహనంపై జల్పల్లి ప్రాంతలోని వాంబేకాలనీలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు.. ముందుగా సెల్ఫీ వీడియోను చిత్రీకరించి.. నేను అమ్మ లేకుండా ఉండలేను.. చనిపోతున్నాను .. అమ్మ వైద్యానికి తెచ్చిన అప్పులను ఇంటిని అమ్మి అందరికీ ఇవ్వాలని స్నేహితులకు పంపాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని చెరువులోనుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.