అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదేనేమో..? తాజాగా చిరంజీవిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఎంత వేగంగా ఈయన సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా అనుకోని కారణాలు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
2020లోనే రెండు సినిమాలతో రావాలని చూసాడు మెగాస్టార్. కానీ కరోనాకే గతేడాది పోయింది. పోనీ ఈ ఏడాది కాలం బాగానే ఉంది కదా ఆచార్యను త్వరగా పూర్తి చేసి విడుదల చేసేద్దామని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాడు చిరంజీవి.
దానికి తగ్గట్లుగానే రెస్ట్ లేకుండా షూటింగ్ చేసాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. మరో 15 రోజులు షెడ్యూల్ అయితే షూటింగ్ పూర్తైనట్లే.
ఈ సినిమాను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కరోనా మరోసారి అడ్డుపడింది.
దాంతో సినిమా అప్పుడు రావడం లేదు. దాంతో ఆచార్య కొత్త తేదీ ఎప్పుడు అనేది కూడా అర్థం కావడం లేదు.
జూన్ 18న ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు లూసీఫర్ రీమేక్ షూటింగ్ కూడా ఏప్రిల్లోనే మొదలు పెట్టాలనుకున్నాడు మెగాస్టార్.
మోహన్ రాజా ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. ఏప్రిల్లో సినిమా మొదలు పెట్టి అక్టోబర్లో విడుదల చేయాలనుకున్నాడు చిరంజీవి. దానికి తగ్గట్లుగానే ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది.
అన్నీ సిద్ధం చేసుకున్నా కరోనా కారణంగా ఆచార్య అలాగే ఉండిపోయింది.. దానికితోడు లూసీఫర్ కూడా ముందుకు కదలడం లేదు.
మరోవైపు కమిటైన సినిమాల లిస్ట్ మాత్రం చాంతాడంత ఉంది. మెహర్ రమేష్ వేదాళం రీమేక్ కూడా అలాగే ఉంది.
ఇవన్నీ చిరంజీవి ఎప్పుడు పూర్తి చేస్తాడో అర్థం కావడం లేదు. వరసగా సినిమాలు కమిటై.. ఏడాదికి రెండు ప్రాజెక్టులు విడుదల చేద్దామని ఫిక్సైపోతే కాలం మాత్రం కలిసిరావడం లేదు.
పాపం అన్నీ బాగానే ఉన్నా.. కాలం కలిసిరాకపోతే దానికి మెగాస్టార్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అంటున్నారు అభిమానులు.
ఆచార్య ఈ ఏడాది వస్తే లూసీఫర్, వేదాళం రీమేక్స్ 2022లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు చిరంజీవి.
చూడాలి మరి.. అప్పటికి కాలం కరుణిస్తుందో లేదో..? వీటితోపాటు బాబీ సినిమాకు కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు చిరంజీవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి