వివాహ వేడుకలపై కొవిడ్ ప్రభావం
ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 23: “కొవిడ్కు ఇక కాలం చెల్లిపోయింది.. ప్రభుత్వాలు సడలింపులిచ్చాయి.. వ్యాపార సముదాయాలు తెరచుకున్నాయి.. ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి.. ఇక జన జీవనం గాడిలో పడింది..” అనుకునే లోపే కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది.. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేస్తున్నది. ప్రజలను గడగడా వణికిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మున్ముందు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చు. ఈ కరోనా ప్రభావం పెండ్లి ముహూర్తాలపైనా పడింది. గత సంవత్సరం లాక్డౌన్తో పాటు ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ముహూర్తాలు ఉన్నప్పటికీ ఘనంగా వేడుకలు నిర్వహించే పరిస్థితి లేదు. మరి వివాహం జరిపించడం ఎలా ? కరోనా అంతమయ్యేదాకా ఆగాలా..? సాధ్యాసాధ్యాలను ఒక్కసారి పరికిద్దామా..!
వచ్చే నెల నుంచి ముహూర్తాలు..
గత సంవత్సరం వాయిదా పడిన వివాహాలన్నీ కరోనా సడలింపుల తర్వాత పూర్తయ్యాయి. చైత్ర మాసం తర్వాత వచ్చే వైశాఖ మాసంలో ఎక్కువగా పెండ్లి చేయడానికి పెద్దలు ఇష్టపడతారు. ఈ చొప్పున వచ్చే నెల 10 వరకు చైత్ర మాసం ఉండగా 11 నుంచి జూన్ 5 వరకు వైశాఖమాసం ఉంటుంది. మే నెలలో 1, 6, 8, 12, 13, 18, 23, 28, 29, 30 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే జూన్లో 2 , 3, 4, 5, 6వ తేదీల్లోనూ ఉన్నాయి. ఇక జూలై 6 వచ్చిదంటే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ముహూర్తాలు ఉండవు.
పెండ్లి వేదికలు ఖరారు..
వచ్చే నెలలో ఉమ్మడి జిల్లాలో వందలాది పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇప్పటికే వధూవరుల తల్లిదండ్రులు పెండ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కల్యాణ మండపాలు, సన్నాయిమేళాలు, క్యాటరింగ్, డెకరేషన్, ఫొటో, వీడియోలకు అడ్వాన్స్లు సైతం ఇచ్చారు. పురోహితులను సంప్రదించి ముహూర్తాలూ నిర్ణయించారు. కానీ మరోవైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నది. అధికారులు, పోలీసులు పటిష్టంగా ప్రభుత్వ నిర్దేశాలను పాటిస్తారు.
నిబంధనలు తప్పనిసరి..
పరిమితమైన సన్నిహితుల మధ్య వివాహం చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశిస్తున్నది. ఎంత తక్కువ మంది మధ్య వేడుక జరిగితే అందరూ అంత సేఫ్. వివాహం ఎక్కడ జరిగినా, ఎలా జరిగినా కొవిడ్ నిబంధనలు మాత్రం మరచిపోవద్దు. వేదిక వద్ద తప్పకుండా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
రిజిస్ట్రేషన్ మ్యారేజీ సో బెటరు..!
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అంగరంగ వైభవంగా పెండ్లి చేసే పరిస్థితి లేదు. భాజాభజంత్రీలు, భారీ షామియానాలకు అవకాశం లేదు. బంధుమిత్రులు, స్నేహితుల మధ్య బరాత్లకు చాన్సే లేదు. ఈ నేపథ్యంలో వధూవరులు ఇష్టపడితే.. ముహూర్తం నిశ్చయమైతే ఇదే ముహూర్తానికి రిజిస్ట్రేషన్ మ్యారేజీ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఇలా అయితే పెట్టిన ముహూర్తం, సమయం ఏదీ వృథా కాదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి వధూవరులు పేర్లు నమోదు చేసుకుంటే చాలు వివాహానికి సన్నాహాలు చేసుకోవచ్చు. పెళ్లి ఖర్చు తగ్గుతుంది.. ఆర్భాటాలూ ఉండవు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత వైభవంగా రిసెప్షన్ పెట్టుకోవచ్చు. అంతేకాదు మిగిలిన పెళ్లి ఖర్చులో ఎంతోకొంత కొవిడ్తో బాధపడుతున్నవారికి, ఆపన్నులకు సాయం చేయొచ్చు.
ఇవి కూడా చదవండి
మంటల్లో వాహనాలు..పోలీసులకు తప్పిన ప్రమాదం
బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరికలు