సిమ్లా : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 14 వరకూ పొడిగించింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూను జూన్ 14 ఉదయం ఆరు గంటల వరకూ పొడిగించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం వారికి టెలిఫోన్ లో వైద్య నిపుణులతో కన్సల్టేషన్ సేవలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా వ్యాక్సిన్లను సేకరించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ స్కూల్ బోర్డు నిర్వహించే పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.