కోల్కతా: పశ్చిమబెంగాల్లో విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించేలా ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆమె కోల్కతాలో ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
యువత స్వావలంబన కోసం వార్షిక సాధారణ వడ్డీతోనే రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నట్టు చెప్పారు. బెంగాల్కు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరినవారితో పాటు కోచింగ్ సెంటర్లలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చినహామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.
15 ఏండ్లలో తిరిగి చెల్లించేలా నామమాత్రపు వార్షిక సాధారణ వడ్డీ రేటుతో రూ.10 లక్షలు రుణం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకం’ అమలు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రెడిట్ కార్డు ద్వారా 4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తామని సీఎం పేర్కొన్నారు.