నల్లగొండ : ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా రత్న ఫంక్షన్ హాల్లో నల్లగొండ జిల్లా టీజీవో అధ్యక్షులు ఆర్. శ్రీనివాస మూర్తి అద్ధ్యక్షతన నిర్వహించిన టీజీవో విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కీలకపాత్ర వహిస్తూ కృషి చేస్తోందన్నారు.
కరోనా వ్యాప్తిలాంటి విపత్కర పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు. ఉద్యోగుల వయో పరిమితి వయస్సు 58 నుండి 61 సంవత్సరాలకు పెంచారు. సీ.పీ.ఎస్. ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్సించారు. ఉద్యోగుల విన్నపం ననుసరించి సానుకూలంగా స్పందించిన సీఎంకు, సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్కు, రాష్ట్ర అధ్యక్షురాలు మమతకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రాష్ట్రం లోని వివిధ శాఖలలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హోంగార్డు, అంగన్వాడీ, ఆశా వర్కర్ల ప్రయోజనాల కోసం టీజీవో సంఘం కృషి చేసిందన్నారు. రాష్టంలో మొత్తం ఉద్యోగులు సుమారు 9 లక్షల 17 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు. పీఆర్సీ, వయోపరిమితి పెంపుకు కృషి చేసిన రాష్ట్ర, జిల్లా టీజీవో కమిటీల బాధ్యులను ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సామల సహదేవ్, కోశాధికారి రవీందర్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు రవీందర్ రావు, సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు మోహన్ రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస మూర్తి, హైద్రాబాద్ జిల్లా అధ్యక్షులు కృష్ణా యాదవ్, ప్రధాన కార్యదర్శి ముజీ బుద్దిన్, భువనగిరి జిల్లా టీజీవో అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రెడ్డి, నల్లగొండ జిల్లా ట్రెజరర్ జగదీశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు, వివిధ శాఖలకు చెందిన గెజిటెడ్ అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.