బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ జూలై 7న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారాం ఉదయం 7.30 నిమిషాలకు కన్ను మూశారు. దిలీప్ కుమార్ మరణ వార్తతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దిలీప్ కుమార్ మరణం తర్వాత చిన్నతనంలో నివసించిన ఇంటిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పస్తుత పాకిస్థాన్ భూభాగంలోని పెషావర్లో జన్మించారు. ఆయన పుట్టినప్పుడు పెషావర్ భారత భూభాగంలో ఉండేది. కాని ఇప్పుడు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లింది. పెషావర్లోని ప్రఖ్యాత క్విస్సా ఖవానీ బజార్లో ఈ ఇల్లు ఉండగా, పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని త్వరలోనే మ్యూజియంగా మార్చాలని అనుకుంటుందట.
1940లో పుణేకి వచ్చి కాలక్రమంలో ఆనాటి బాంబే నగరానికి చేరుకున్నారు దిలీప్ కుమార్. 1947లో భారత్ రెండుగా ముక్కలై పాకిస్థాన్ ఏర్పడ్డాక దిలీప్ కుమార్ తిరిగి తన సొంతింటికి ఎప్పుడూ వెళ్లలేదు. 2014లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ ఇంటిని జాతీయ వారసత్వం కట్టడంగా ప్రకటించింది. దీనిని మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రస్తుత యజమాని హాజీ లాల్ మహమ్మద్ అందుకు ససేమిరా అంటున్నాడు.రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇంటిని తక్కువ ధరకు అమ్మలేనని, ప్రభుత్వం రూ.25 కోట్లు ఇస్తే ఇంటిని అమ్మేందుకు తాను సిద్ధం అని వెల్లడించాడు.