లక్నో: పదుల సంఖ్యలో యమునా నదిలో తేలుతున్న శవాలను చూసి యూపీలోని హమీర్పూర్లోని ప్రజలు వణుకుతున్నారు. వీళ్లంతా కరోనాతో చనిపోయిన వాళ్లేమో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. హమీర్పూర్లో ఎన్ని కరోనాతో చనిపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారంటే.. వాళ్లను దహనం చేయడానికి చోటు దొరక్క.. ఇలా నదిలో పడేశారేమోనని కొందరు చెబుతున్నారు. యూపీలోని ఈ ప్రాంతంలో కరోనాతో ఎంత మంది చనిపోయారన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంట సమాచారం లేకపోవడం గమనార్హం. ఇక్కడి ఓ గ్రామంలో చనిపోయిన వాళ్లకు యమునా నది తీరంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
హమీర్పూర్, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది కరోనాతో చనిపోయినట్లు ఇక్కడి గ్రామస్థులు చెప్పారు. అలా చనిపోయిన వాళ్లను యమునా నదిలోకి విసిరేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య యమునా నది ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడ చనిపోయిన వాళ్లను నదిలో విసిరేయడం ఆనవాయితీగా వస్తోందని హమీర్పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ వెల్లడించారు. అప్పుడో ఇప్పుడో ఒకటి రెండు శవాలు తేలుతూ కనిపించడం సాధారణమే. అయితే ఈ కొవిడ్ వేళ శవాలు వరదలా వస్తున్నాయి. దీనిని బట్టే కొవిడ్తో ప్రజలు ఏ స్థాయిలో చనిపోతున్నారో అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పడం గమనార్హం.
చనిపోయిన వారి ద్వారా కూడా కొవిడ్ సోకుతుందన్న భయంతో వారికి అంత్యక్రియలు జరపకుండా యమనా నదిలో విసిరేస్తున్నారు. అందుకే ఇలా పదుల సంఖ్యలో శవాలు కనిపిస్తున్నాయి అని అనూప్ చెప్పారు. ఈ ప్రాంతాల్లో కొవిడ్ చనిపోయిన వారికి అక్కడి వాళ్లే అంత్యక్రియలు చేస్తున్నారని, ఈ లెక్క అధికారుల దగ్గర లేదని స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు.