న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ మెడికల్ ఆక్సిజన్ ను భారత్ ఎగుమతి చేస్తోందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే రోగులకు ప్రాణవాయువు అందించే మెడికల్ ఆక్సిజన్ ను భారత్ ఎగుమతి చేస్తోందనే దుష్ప్రచారం సాగిస్తున్నారని ఇది పూర్తిగా సత్యదూరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పారిశ్రామిక ఆక్సిజన్ ఎగుమతులను మెడికల్ ఆక్సిజన్ గా పొరబడుతున్నారని పేర్కొన్నాయి.
2020-21 ఏప్రిల్-ఫిబ్రవరిలో భారత్ 9884 మెట్రిక్ టన్నుల పారిశ్రామిక ఆక్సిజన్ ఎగుమతులు చేపట్టగా 12 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ నే ఎగుమతి చేశారని తెలిపాయి. భారత్ లో వార్షిక మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో కేవలం 0.4 శాతంలోపే ఎగుమతులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్ లో తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నా వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేసే రవాణా వ్యవస్ధను నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ఆక్సిజన్ అందక పలువురి ప్రాణాలు గాలిలో కలిశాయని ఈ మరణాలకు ఎవరు బాధ్యులని ఆమె మండిపడ్డారు.