కరోనా కష్టకాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు రెండు కోట్ల రూపాయలతో ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.దీనికి మంచి ఆదరణ లభించింది. తాము అనుకున్న రూ.11 కోట్ల టార్గెట్ను సాధించడంతో ఆ మొత్తాన్ని కోవిడ్ ఉపశమనం కోసం అవిరామంగా పనిచేస్తున్న ACT గ్రాంట్లకు వెళ్తాయని పేర్కొన్నారు. ఇక తాజాగా రెండేళ్ల చిన్నారికి సాయం అందించి నెటిజన్స్ ప్రశంలసు పొందుతున్నారు.
ఆయాన్ష్ గుప్తా అనే రెండేళ్ల చిన్నారి వెన్నెముకకు సంబంధించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారిని కాపాడడానికి అతి ఖరీదైన జోల్గెన్స్ మా అనే మందులు అవసరమయ్యాయి. అందుకు రూ.16 లక్షలు అవసమరని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక చిన్నారి తల్లిదండ్రులు ‘ayaanshfightsSMA’ పేరిట ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టి విరాళాలు సేకరించారు. సోమవారంతో తన కుమారుడి మెడిసిన్కు కావాల్సిన రూ.16 కోట్లు వచ్చాయని ప్రకటించారు. ఈ సందర్భంగా విరాళాలు అందించిన వారితో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ధన్యవాదాలు తెలిపారు.
‘మా ఈ #Saveayaanshgupta ఫండ్ రైజింగ్ క్యాంపైన్ ఇంత త్వరగా ముగుస్తుందనుకోలేదు. జోల్గెన్స్మా మెడిసిన్కు కావాల్సిన రూ.16 కోట్లు వచ్చాయి. అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. అలానే విరాట్ కోహ్లీ దంపతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. విరాట్ అండ్ అనుష్క.. మిమ్మల్ని అభిమానులుగా ఎప్పుడు ప్రేమిస్తాం. అయాన్ష్ కోసం ఊహించినదాని కన్నా ఎక్కువ చేశారు. మా జీవితంలోనే ఈ కఠినమైన మ్యాచ్ను సిక్స్తో గెలవడానికి మీరు సాయం చేశారు. మీ సాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.’అని పేర్కొన్నారు. అయితే విరుష్క దంపతులు ఎంత సాయం చేశారనేది మాత్రం వెల్లడించలేదు.