తిరుమల : శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6న పుష్పయాగం జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే పుష్పయాగం జరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారులు, భక్తులతో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణతో సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు పేర్కొన్నారు.
ఇందు కోసం సోమవారం ఆలయంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్స్యంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరుగనుంది. 6న ఉదయం 10 నుంచి 11గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..