సిద్దిపేట అర్బన్, మార్చి 20: సిద్దిపేట జిల్లా కోహెడ మం డలం తంగెడపల్లి గ్రామానికి తూర్పున ఉన్న పాటిగడ్డమీద పెద రాతియుగం నాటి సమాధుల ఆనవాళ్లను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, చంటి శనివారం వెల్లడించారు. ఈ సమాధుల ఆవరణలో స్మారక శిలలు ఉన్నాయని, ఇందులో ఒక నిలువురాయి ఉన్నదన్నారు. దీన్ని ఫ్రెంచ్ భాషలో మెన్హర్ అని పిలుస్తారు. ఈ రాయి 18 నుంచి 20 అడుగుల ఎత్తు ఉండగా, పుల్లూరు, నర్మెటలోని మెగాలిథిక్ సమాధుల వద్ద కనిపించిన మెన్హర్ల కన్నా ఎత్తయినదని తెలిపారు. ఈ మెన్హరున్న చోటికి కొద్ది దూరంలో ఒక రాతిగుండుకు రాతికళకు చెందిన నిలువెత్తు గీకుడుబొమ్మ (పెట్రోైగ్లెఫ్) త్రిశూలం రూపంలో కనిపిస్తుందని చెప్పారు. ఇది కూడా పెద రాతియుగం నాటి రాతికళలో భాగమైన పురామానవుని చిత్రకళగా అభిప్రాయపడ్డారు. ఈ రాతి చిత్రకళ గీకుడుబొమ్మలు, చెక్కుడు బొమ్మలు, రాతి చిత్రాలు అని మూడు విధాలుగా ఉంటాయన్నారు. ఈ రాతికళ అతి ప్రాచీనమైనది. పురామానవులు మనకు తెలియజేయడానికి కనిపెట్టిన బొమ్మలరాత అని వారు తెలిపారు. ఈ రాతలను బట్టే నాటి మనషుల జీవనాన్ని గ్రహించవచ్చన్నారు. చిర్రగోనె ఆటలో చేసే చిత్తుడుగుంట ఆకారంలో అక్కడున్న పరుపురాతి బండలమీద గ్రూ వ్స్ ఉన్నాయని, ఇవి కొత్త రాతియుగం పురా మానవులు తమ రాతి గొడ్డండ్లను నూరినపుడు ఏర్పడ్డ నూరుడు గుంటలని వెల్లడించారు. ఇవి కనిపించిన చోట పురామానవులు ఉండేవారని చెప్పడానికి గొప్ప ఆధారాలుగా వారు అభివర్ణించారు.