‘దిల్రాజుగారు, శిరీష్ అన్న సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్లే అసలైన రౌడీబాయ్స్. ఎక్కడో నిజామాబాద్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించి అగ్ర నిర్మాతలుగా ఎదిగారు. థియేటర్లు, సినీ నిర్మాణరంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. నేను వారిని స్ఫూర్తిగా తీసుకుంటా. రాజుగారితో మైండ్బ్లోయింగ్ సినిమా చేయడం కోసం నిరీక్షిస్తున్నా. త్వరలో ఆ సినిమా గురించి ప్రకటిస్తాం’ అన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు.
నవంబర్ 19న విడుదల కానుంది. బుధవారం ఈ సినిమాలోని ‘ప్రేమే ఆకాశం..’అనే పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్దేవరకొండ…హీరోగా పరిచయమవుతున్న ఆశిష్కు శుభాకాంక్షలందజేశారు. దిల్రాజు, శిరీష్ గర్వపడేలా ఆశిష్ గొప్ప నటుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. దిల్రాజు మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండను అడిగి సినిమాకు ఈ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో విజయ్ గొప్ప స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత ఓ ఈవెంట్కు వెళితే విజయ్కి యూత్లో ఉన్న క్రేజ్ చూసి ఇండస్ట్రీకి మరో పవన్కల్యాణ్ దొరికాడనిపించింది. యువత మెచ్చే అంశాలతో ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని తెరకెక్కించాం. దేవిశ్రీప్రసాద్ కథానుగుణంగా అద్భుతమైన సంగీతాన్నందించాడు.
అనుపమ పరమేశ్వరన్ మా సంస్థలో చేసిన మూడో చిత్రమిది. పాత్రలో ఒదిగిపోయి నటించింది. ‘రౌడీ బాయ్స్’ యువతరాన్ని ఆకట్టుకునే చిత్రమవుతుంది’ అన్నారు. “హుషారు’ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పాట రిలీజ్ చేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఆయన విడుదల చేసిన పాట అందరికి నచ్చుతుంది. దేవిశ్రీప్రసాద్ చక్కటి స్వరాల్ని అందించారు. ఈ ప్రేమగీతంలో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది’ అని దర్శకుడు తెలిపారు. “విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసి పాట ఆవిష్కరించిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని హీరో ఆశిష్ చెప్పారు.