‘నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమై పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో నేను చేసిన ప్రతి సినిమా కొత్త అనుభూతిని మిగిల్చింది’ అని అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హుషారు’ వంటి చిత్రాలతో నిర్మాతగా చక్కటి విజయాల్ని అందుకున్నారాయన. నేడు బెక్కెం వేణుగోపాల్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా. కరోనాపై తెలిసినవారందరిలో అవగాహన కల్పిస్తున్నా. నిరంతరం సినిమాల గురించే ఆలోచిస్తుంటా. నా ప్రయాణంలో దిల్రాజు లాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా నిర్మిస్తున్నా. నవరసాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మే 1న సినిమాను విడుదలచేయాలనుకున్నాం. కరోనా ప్రభావంతో వాయిదావేశాం. ఈ ఏడాది శ్రీవిష్ణు, బిగ్బాస్ సొహెల్లతో సినిమాలు చేయబోతున్నా’ అని తెలిపారు.