ముంబై : అయోధ్యలో వివాదాస్పద బాబ్రి మసీదు కూల్చివేతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు.. వారి కూటమిలో లుకలుకలకు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తున్నది. శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ, కాంగ్రెస్తో జతకట్టిన శివసేన.. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి మద్దతుదారుగా సమాజ్వాది పార్టీ కూడా ఉన్నది. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించిన సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు.. మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) సంకీర్ణంలో చీలికను సృష్టించినట్లు తెలుస్తున్నది. మహా వికాస్ అఘాడి భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఉద్దవ్ ఠాక్రేతో వ్యాఖ్యలతో కలత చెందారు. దాంతో ఎంవీఏ ప్రభుత్వంలోని ముస్లిం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఎస్పీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ కోరారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను ముగిస్తూ ఠాక్రే మాట్లాడారు. ఈ సందర్భంగా వివాదాస్పద బాబ్రీ మసీదు సమస్యను ఎత్తిచూపారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం అందరూ పారిపోయారు. కూల్చివేతకు తామే కారణమంటూ చాటిన శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే బాధ్యత వహించారు. నిజంగా శివ సైనికులు ఇలా చేసి ఉంటే నేనెంతో గర్వపడుతున్నాను” అని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. 2018 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత ఈ కూటమి ఏర్పడిన ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ గురించి ముఖ్యమంత్రి మర్చిపోయారేమో? అని అబు అజ్మీ చురకలు అంటించారు. సమాజ్వాదీ పార్టీకి మహారాష్ట్ర అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు కూడా లేఖ రాస్తానని అబూ అజ్మీ తెలిపారు. ఈ సమస్య ఎంవీఏకు సంబంధించినది అయినందున ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ లేదా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మాత్రమే ఇటువంటి అంశాలపై మాట్లాడగలరని శివసేన సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.