సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతూనే ఉన్నారు. తాజాగా మరో లెజెండరీ నటి కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రతిమా దేవి మరణించారు. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్న ఈమె.. పరిస్థితి విషమించి ఏప్రిల్ 7న మధ్యాహ్నం కన్నుమూశారు.
కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో మరిచిపోలేని సినిమాల్లో నటించారు ప్రతిమా దేవి. ఈమె వయసు 88 సంవత్సరాలు. కర్ణాటకలో తొలి వంద రోజుల చిత్రం జగన్మోహినిలో ప్రతిమ దేవి నటించారు. 1951లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 100 రోజులకు పైగా విజయవంతంగా నడిచింది. జగన్మోహినితో పాటు కృష్ణ లీల, చంచల ఉమరి, శివశరణే నమియక్క మంగళ సూత్రం వంటి సినిమాలతో స్టార్ అయిపోయింది. 2011 లో కర్ణాటక ప్రభుత్వం ప్రతిమా దేవిని లైఫ్ టైం అవార్డుతో సత్కరించింది.
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త స్వతంత్ర సమర యోధుడు శంకర్ సింగ్ను పెళ్లి చేసుకుంది ప్రతిమ. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా కన్నడ సినీ పరిశ్రమలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఒక లెజెండరీ నటిని కోల్పోయిందని.. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ చెప్పుకొచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి. మరోవైపు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రతిమా దేవి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి