వెంకటేశ్-త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ అంటేనే అదోరకం ఆసక్తి. ఈ రోజు త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఈ స్థాయి అనుభవిస్తున్నాడంటే దానికి కారణం వెంకటేష్ కూడా. కెరీర్ మొదట్లో త్రివిక్రమ్ రచయితగా ఉన్నపుడు వెంకీతో చేసిన సినిమాలు సంచలనం సృష్టించాయి. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్తో త్రివిక్రమ్ సినిమా చేయలేదు కానీ అంతకు ముందు మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, వాసు సినిమాలకు కలిసి పనిచేసారు ఈ జోడీ. రచయితగా త్రివిక్రమ్ కు నందులు కూడా వెంకీ సినిమాలతో వచ్చాయి. అలాంటి కాంబినేషన్ ఇది. అయితే దర్శకుడు అయిన తర్వాత ఎందుకో కానీ ఈ హీరోతో పనిచేసే అవకాశమే రాలేదు త్రివిక్రమ్ కు. ఈయన ఎక్కువగా ఈ తరం హీరోలపై దృష్టి పెట్టడంతో ఎప్పుడూ వెంకీ వైపు చూడలేదు ఈ మాటల మాంత్రికుడు.
టీవీలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అద్భుతమైన ఎంటర్ టైనర్స్ ఇచ్చారు ఈ జోడీ. అయితే దర్శకుడిగా మారిన తర్వాత త్రివిక్రమ్ ఎక్కువగా పవన్, మహేశ్, బన్నీ లాంటి స్టార్స్కే పరిమితం అయిపోయాడు. దాంతో ఇతర హీరోలకు చాన్స్ రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే త్రివిక్రమ్ రూట్ మారుస్తున్నాడు. ఆ మధ్య కెరీర్ లో తొలిసారి ఎన్టీఆర్ తో సినిమా చేసాడు. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు హీరోగా సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ హీరోగా సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. అప్పట్లో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ అంతా సైలెంట్ అయిపోయారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో నయనతార, త్రిషల్లో ఎవరో ఒకరు హీరోయిన్గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో నయన్ తో కలిసి లక్ష్మి, తులసి సినిమాలు చేసాడు వెంకటేష్. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. మరోవైపు త్రిషతో కలిసి నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సూపర్ హిట్ కాగా.. నమో వెంకటేష, బాడీగార్డ్ సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకటేష్తో లో బడ్జెట్ లో సినిమా చేసి ఎక్కువ లాభాలు ఆర్జించాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎలాగూ త్రివిక్రమ్-వెంకీ అంటే కనీసం 40 కోట్ల మార్కెట్ వర్కవుట్ అవుతుంది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇక..