న్యూఢిల్లీ : ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు గుజరాత్ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ 1500 కోట్లు కేటాయించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి నితిన్ భాయ్ పటేల్ పేర్కొన్నారు. మరోవైపు గతంలో 2023లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రకటించిన నేపథ్యంలో మహారాష్ట్రలో భూసేకరణ పనులు నిలిచిపోవడంతో తాజా డెడ్లైన్ను త్వరలో ప్రకటిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల పేర్కొన్నారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో భూ సేకరణ పనుల్లో జాప్యం కారణంగా 2023లో ప్రాజెక్టు పట్టాలెక్కడం సాధ్యం కాకపోవచ్చని గోయల్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎంతో తాను ఈ అంశంపై చర్చించానని, రైల్వే మంత్రిత్వ శాఖ సైతం మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ ట్రైన్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలిల్లో దాదాపు 12 స్టేషన్ల మీదుగా 508.7 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ముంబై, థానే, విరార్, బోసర్, వపి, బిలిమోర, సూరత్, బరూచ్, వదోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతిల్లో 12 స్టేషన్లను నిర్మిస్తారు.