‘వేదం’ చిత్రంలో సిరిసిల్ల రాములుగా సహజ అభినయంతో ప్రేక్షకుల మెప్పుపొందిన నటుడు నాగయ్య శనివారం గుంటూరులో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘వేదం’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ తన మనవడి ఉన్నతిని చూడాలని తపించే తాత పాత్రకు నాగయ్య జీవం పోశారు. ‘వేదం’ తర్వాత దాదాపు ముప్పైకిపైగా సినిమాల్లో నటించారు నాగయ్య. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంలో ఓ పాటలో కనిపించారాయన. అయితే కొద్దికాలంగా సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా కృంగిపోయారు. దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. కొన్నేళ్ల క్రితం నాగయ్య దీనస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయన్ని సచివాలయానికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని అందించారు. ‘మా’ అసోసియేషన్ నెలకు 2,500 ఫించన్ అందిస్తూ ఆదుకుంటోంది. కొన్ని నెలల కిత్రం నాగయ్య భార్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన మానసికంగా కృంగిపోయారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన ఆయన శనివారం కన్నుమూశారు. నాగయ్య మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ సంతాపం
సినీ నటుడు నాగయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగయ్య ‘వేదం’ చిత్రంలో సిరిసిల్ల రాములు పాత్రలో జీవించి లక్షలాది మందిని కదిలించారన్నారు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని స్వయంగా కలిశానని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా తామిద్దరి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణను మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. నాగయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.