కామారెడ్డి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నూతన కలెక్టరేట్, డీపీవో భవనాల ప్రారంభోత్సవం
స్పీకర్ పోచారం, ప్రభుత్వ విప్ గోవర్ధన్లకు ఫోన్చేసిన సీఎం
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
నిజామాబాద్, జూన్ 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 20న కామారెడ్డి జిల్లాకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న నూతన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించేందుకు కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ రెండో వారంలోనే సీఎం పర్యటన ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇది వరకే పూర్తి చేశారు.
సీఎం రాక సందర్భంగా కలెక్టరేట్, డీపీవో భవనాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో అలంకరణ మొక్కలను సైతం అమర్చారు. గ్రీనరీ కనిపించేలా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దారు. డీపీవో భవనం ఎదుట తారు రోడ్డు నిర్మాణంతో పాటు ఇతరత్రా ముగింపు పనులు సైతం చకచకా పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు భవంతులు ప్రారంభానికి సిద్ధం కావడంతో ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 19నుంచి జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి సిద్ధమైన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు 20వ తేదీన రానున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల తనిఖీలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ, పురపాలక శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాలు, పట్టణాలను మరింత సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.