రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలన ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరిగి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు ఎక్కడెక్కడనో వివిధ శాఖల కార్యాలయాలు ఉండేవి. దీంతో ప్రజలకు ఇబ్బంది మారింది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలకు సౌకర్యంగా మారడంతో పాటు పనులు వేగంగా పూర్తికానున్నాయి. దీనికోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్, నమూనా పోలీస్ కమిషరేట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
సిద్దిపేట, జూన్ 15( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. ఈనెల 20న సీఎం కేసీఆర్ వీటిని ప్రారంభించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
స్వయంగా స్థలాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్…
సిద్దిపేట- హైదరాబాద్ రాజీవ్ రహదారిపై ‘సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)’ పరిధిలోని కొండపాక మండలం దుద్దెడ శివారులో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ పరిశీలించి ఎంపిక చేశారు. 2017, అక్టోబర్ 11న సమీకృత కలెక్టరేట్ భవనం, పోలీసు కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.54 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని జీప్లస్ -2 పద్ధతిలో నిర్మించారు. ఇదే సముదాయంలో కలెక్టర్,అదనపు కలెక్టర్ల కుటుంబాలు నివసించడానికి జీప్లస్ -1 పద్ధతిలో రూ. 7.90 కోట్లతో భవనాలు సిద్ధం చేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనాన్ని, క్యాంపు కార్యాలయాన్ని సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో రూ.15 కోట్లతో నిర్మించారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలో 60 అడుగుల ఎత్తులో జాతీయజెండా, వేల సంఖ్యల్లో మొక్కలు పెంచారు. ఎనిమిది మంది జిల్లాస్థాయి అధికారులకు నివాస గృహాలు, హెలిప్యాడ్, అన్నీ విభాగాలకు ప్రత్యేక గదులు నిర్మించారు. సమీకృత కలెక్టరేట్లో మిగిలిన చిన్న చిన్న పనులు, ఫర్నిచర్ తదితర సదుపాయాలను పూర్తి చేసేందుకు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి 12 బ్లాక్లకు 12 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు. వారి పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
సరికొత్త హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనం..
సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఆధునిక వసతులతో నిర్మించారు.1,61,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ – 2 పద్ధతిలో సుమారు 46 శాఖలకు సరిపడే విధంగా భవన నిర్మాణం చేపట్టారు. 3 సెమినార్ హాళ్లు, ఆధునిక వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. 500 మంది కూర్చుండి సమావేశం నిర్వహించుకునేలా ఆడిటోరియం నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులు ఒక్కొక్కటి 53,740 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాలు పూర్తిచేశారు.సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో పెండింగ్ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పర్నిచర్,ఇతర సామగ్రిని చేరవేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లతో పాటు సమావేశ మందిరాలకు కేటాయించారు. మొదటి,రెండో అంతస్తులో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాలకు గదులను కేటాయించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్…
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణం పూర్తిచేశారు. 20ఎకరాల విస్తీర్ణంలో 58,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కమిషనరేట్ను జీప్లస్-2 పద్ధ్దతిలో పూర్తి చేశారు. అత్యాధునిక టెక్నాలజీ నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. 6 ఎకరాల విస్తీర్ణంలో కమిషనర్ రెసిడెన్స్, క్యాంపు కార్యాలయం, క్వార్టర్స్ తదితర వాటిని నిర్మిస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో సీపీ కార్యాలయం, పబ్లిక్ గ్రీవెన్స్ సెల్, గార్డ్రూం, పీసీ రూమ్, ఇద్దరు అడిషనల్ డీసీపీల గదులు, పీఆర్వో, ఏసీపీ, వివిధ విభాగాలకు చెందిన గదులను సిద్ధం చేశారు.
పాలనా సౌలభ్యమే ధ్యేయంగా…
ఆధునిక హంగులతో నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ నిర్మాణాలు పూర్తి చేశారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆధునిక సొబగులతో అన్ని శాఖల జిల్లా అధికారులకు ప్రత్యేక గదులు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, ప్రజలకు కూర్చునేందుకు విశ్రాంతి గది, ఏటీఎం, క్యాంటీన్, దుకాణం ఇలా రెండు అంతస్తుల్లో గదులను నిర్మించారు. అంతేకాక వీటీలో ప్రొక్యూర్మెంట్ శాఖలు ఒక దగ్గర, వెల్ఫేర్ శాఖలు ఒక దగ్గర, మహిళా, వృద్ధ్దులు, దివ్యాంగులు సంక్షేమ శాఖల కార్యాలయాలు గ్రౌండ్ ఫోర్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లో సీపీ, డీసీపీ, ఏపీపీలకు ప్రత్యేక చాంబర్లు, అన్నీ విభాగాల పోలీస్ కార్యాలయాలను రెండు అంతస్తుల్లో ఒకే దగ్గర ఉండే విధంగా నిర్మించారు.
జీప్లస్ టూ భవనంలో 105 గదులు..
ఈ జీ ప్లస్ టూ భవనంలో 105 గదుల నిర్మించారు. గ్రౌండ్ ఫోర్లో 42 గదులు, ఫస్ట్ ఫోర్లో 29, సెకండ్ ఫ్లోర్లో 34 గదులు ఉన్నాయి. వీడియో కాన్పరెన్స్కు కోసం ప్రత్యేక హాల్, సమావేశ మందిరం, క్యాంటీన్, బ్యాంక్ ఏటీఎం, మీసేవ, రికార్డుల గది, స్ట్రాంగ్ రూం, టాయిలెట్లు, పార్కింగ్, గ్రీనరీ తదితర సదుపాయాలను కల్పించారు. కలెక్టరేట్లో జిల్లాకు చెందిన మంత్రికి ప్రత్యేక చాంబర్ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్లలో ఇలాంటి సౌకర్యం ఎక్కడా లేదు. కొత్తగా నిర్మించే ప్రతి సమీకృత కలెక్టరేట్లో మంత్రులకు ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా మంత్రి కోసం ప్రత్యేకంగా ఒక మీటింగ్ హాల్తో పాటు ప్రత్యేక చాంబర్ను కేటాయించారు. ఇక కలెక్టర్ , అదనపు కలెక్టర్ల కోసం జీప్లస్ – 1 భవనాలను నిర్మించారు. కలెక్టర్ భవనం 6,006 చదరపు అడుగుల విస్తీర్ణంలో, జాయింట్ కలెక్టర్ల భవనం 2,877 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అదనపు కలెక్టర్ భవనం 2,129 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. జిల్లాలోని ముఖ్యమైన ఎనిమిది శాఖల జిల్లా అధికారుల కోసం 6,434 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ -1 పద్ధ్దతిలో నాలుగు భవనాలను, ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. కార్యాలయాల్లో సిబ్బందికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక లిఫ్టులను ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజలు, సందర్శకులకు వేర్వేరుగా వాహనాలు నిలుపు స్థలాలను కేటాయిస్తున్నారు. పచ్చదనం, ఆహ్లాదభరితంగా ఉండే విధం గా ఉద్యానవనాలను పచ్చని గ్రీన్ పార్కులను ఏర్పాటు చేశారు. హైవేను తలపించేలా అంతర్గత రోడ్లను నిర్మించారు. నీటి వసతి కోసం ఎక్కడికక్కడ డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు.