నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మంగళవారం టీజర్ను విడుదల చేశారు. చక్కటి అందం, కాస్త పొగరు కలబోసిన నాయికను ప్రేమలో పడేసేందుకు పాట్లు పడుతున్న కథానాయకుడి ప్రయత్నాలతో టీజర్ ఆద్యంతం వినోదప్రధానంగా సాగింది. సంభాషణలు అలరించేలా ఉన్నాయి. ‘ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్స్మన్ను చూశావా? మా వాడు కొడతాడు’…‘ప్రతి బాల్ నోబాల్ ఇచ్చే ఎంపైర్ను చూశావా? ఆవిడ ఇస్తది’ అనే డైలాగ్స్ నవ్వుల్ని పంచాయి. నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజును పురస్కరించుకొని ఈ టీజర్ను విడుదల చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ‘ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్లో థియేటర్స్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: విశాల్చంద్రశేఖర్, మాటలు: గణేష్ రావూరి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, కథ-దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.