ఈ మధ్య సినిమాలకు వివాదాలే ప్రమోషన్స్ అవుతున్నాయి. పాట ద్వారానో లేదంటే పోస్టర్ ద్వారా వివాదం క్రియేట్ చేసి సినిమాపై అందరి దృష్టి పడేలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరుడు కావలెను సినిమాపై వివాదం రాజుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య, రీతూ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుండగా, మరి కొద్ది రోజులలో మూవీని విడుదల చేయనున్నారు. అయితే చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ‘దిగు దిగు దిగు నాగ’ లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో ‘దిగు దిగు దిగు నాగ’ అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. నాగరాజుపై ప్రేమతో ఈ భజన గేయాన్ని పాడుకుంటారు. సినిమా పాటలో ‘కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ లాంటి పదప్రయోగాలు ఉపయోగిస్తూ పాట రాయగా, దీనిపై వివాదం రాజుకుంది.
వరుడు కావలెను’ సినిమాను బ్యాన్ చేయాలని కోరుతూ శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర చౌదరి మాట్లాడుతూ ఈ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.