హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరికీ కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లతో పాటు ఫిల్మ్ జర్నలిస్టులందరికి కరోనా క్రైసిస్ ఛారిటీ కింద టీకాలు వేయనున్నట్లు చిరంజీవి తెలిపారు. అపోలో 24 | 7 సహకారంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఈ టీకా డ్రైవ్ను నిర్వహిస్తోంది.
వాస్తవానికి ఈ టీకా డ్రైవ్ మూడు వారాల క్రితమే ప్రారంభమైనప్పటికీ టీకా షాట్ల కొరత కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిరంజీవి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం వేలాది మంది తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులు నమోదు చేసుకున్నారన్నారు. ప్రతిరోజూ 500 మంది సినీ కార్మికులను టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ్, ఎన్ శంకర్, మెహర్ రమేష్, కె ఎల్ దామోదర్ ప్రసాద్, సి. కళ్యాణ్, బెనర్జీ, సురేష్ వంటి పరిశ్రమ ప్రముఖులు సినీ కార్మికులకు సహాయం చేసేందుకు ఛారిటీకి తమ వంతు సహకారం అందించినట్లు మెగాస్టార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా ఫస్ట్ వేవ్లో సినీ కార్మికులకు అవసరమైన నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. ఈ టీకా డ్రైవ్ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్, తెలుగు ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.