న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి తాప్సీ పన్నుపై కంగన రనౌత్ శనివారం మరో దఫా ఫైర్ అయ్యారు. ఇద్దరు నటీమణుల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉన్నది. ఇటీవల తన నివాసంలో జరిగిన ఐటీ దాడులపై తాప్పీ పన్ను ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన పేరిట పారిస్లో ఇల్లు కొనుగోలు చేయలేదని, సినిమాల్లో నటించినందుకు రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న దాఖలాలు లేవన్నారు.
2013లో తన ఇంటిపై ఎటువంటి ఐటీ దాడి జరుగలేదని తాప్సీ తన ట్వీట్లలో పేర్కొన్నారు. బాలీవుడ్ నటుల ఇండ్లపై 2013లో ఐటీ దాడులు జరిపినప్పుడు తలెత్తని ఇబ్బందులు ఇప్పుడు రావడం ఏమిటని శుక్రవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీనిపై ప్రతిస్పందించిన కంగన రనౌత్.. మీరు ఎల్లవేళలా చౌకబారుగా మాట్లాడుతారు. పన్ను ఎగవేతకు పాల్పడిన మీ రింగ్ మాస్టర్ అనురాగ్ కశ్యప్ ఇంటిపై 2013లో దాడులు చేయలేదా? ఒకవేళ మీరు నిందితులు కాకపోతే ప్రభుత్వ అధికారుల నివేదికకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి సచ్చీలతను నిరూపించుకోండి అని ట్వీట్ చేశారు.