కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం బహుముఖ యుద్ధం చేస్తున్నది. రాత్రి కర్ఫ్యూతో వైరస్ వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపడుతూనే.. కరోనా బాధితులకు స్థానికంగానే సత్వర వైద్య సేవలు అందిస్తూ వారిలో ధైర్యం నింపేలా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన పని లేకుండానే ఐసొలేషన్ కేంద్రాల్లో ఆక్సిజన్తో కూడిన 60 బెడ్లను సిద్ధం చేయడంతోపాటు, వెంటిలేటర్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా 7వేలకు పైగా టెస్టులను చేసి హోం ఐసొలేషన్లో ఉన్నవారికి ఉచితంగా మందులను అందజేస్తున్నారు. అలాగే ప్రతి నిత్యం వెయ్యి మందికి పైగా వ్యాక్సినేషన్ వేయాలని సంకల్పించి 45 ఏండ్లకు పైబడిన వారందరికీ టీకాలు వేయడం ద్వారా 99 శాతం లక్ష్యాన్ని అందుకున్నది. వ్యాక్సినేషన్కు లభిస్తున్న స్పందనతో జిల్లా ప్రజానీకం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నది. ప్రభుత్వం చొరవతో పైసా ఖర్చు లేకుండానే కరోనాను జయించగలిగామని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 24 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భువనగిరిలోని వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పాత గంజ్ మార్కెట్లోని దుకాణాలను శనివారమే మూసివేశారు. ఈ నెల 24 నుంచి మే 1వ తేదీ వరకు దుకాణాలు బంద్ చేస్తున్నామని వ్యాపారులు తెలిపారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్నం అన్న తేడా లేకుండా కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ చికిత్సకు అవసరమైన చర్యలను చేపట్టింది. రానున్న రోజుల్లో వ్యాధి మరింతగా ప్రబలినట్లయితే రోగుల సంఖ్యకు తగ్గట్టు వైద్యసేవలను అందించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్లో 80 పడకలతో, భువనగిరి ఏరియా దవాఖానలో 20 పడకలతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. అలాగే ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ సీహెచ్సీ కేంద్రాల్లో 10 బెడ్ల చొప్పున ఐసొలేషన్ వార్డులను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో 60 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి.
కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో ర్యాపిడ్ టెస్టులను కూడా ప్రభుత్వం పెంచింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను కూడా చేస్తూ వెనువెంటనే హైదరాబాద్కు పంపించి మరుసటి రోజునే ఫలితాలు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పీహెచ్సీల్లోనూ నిర్ధారణ పరీక్షలు చేయాలని సంకల్పించి జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ పీహెచ్సీకి 300 పరీక్షలు, సీహెచ్సీకి 500 చొప్పున 7వేలకు పైగా టెస్టులు చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్గా నమోదైన బాధితుల్లో అధిక శాతం మంది హోం ఐసొలేషన్లో ఉంటున్నారు. వారికి ఉచితంగా మందులను అందజేయడంతోపాటు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్య సాయం అందిస్తున్నారు. అలాగే అత్యవసర సందర్భాల్లో చికిత్సకోసం జిల్లా కేంద్రంలోని ఏరి యా దవాఖానలో వెంటిలేటర్ను అందుబాటులో ఉంచారు.