హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): సాధకునికి మార్గదర్శనం చేసే ఆంజనేయస్వామివారి మంత్రమయ గ్రంథాన్ని ‘జయఘోష’గా అందించే భాగ్యం తనకు లభించడం కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. శ్రీ శృంగేరి పీఠం జ్ఞానసరస్వతి దేవాలయ ధర్మాధికారి, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి సమర్పణ లో ‘జయఘోష’ లక్ష ప్రతులను బుధవారం కవితకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ మంత్రగ్రంథాన్ని వైభవంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. లక్ష పుస్తకాలను అందజేసి, గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకొన్న శ్రీనివాస్ను అభినందించారు. ఈ ప్రతులను అంజన్న సన్నిధానానికి పంపిస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.