టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చనిపోయి కూడా ఏడేళ్లు పూర్తి అయిపోయింది. అయినా కూడా ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు గుర్తుచేసుకొని అభిమానులు బాధపడుతూనే ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి తారాజువ్వలా దూసుకు వచ్చిన ఉదయ్.. పాపం అంతే వేగంగా వెనుకబడి పోయాడు. హ్యాట్రిక్ విజయాల తర్వాత సరైన గైడెన్స్ లేక ఈయన కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఆ తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన ఉదయ్ కిరణ్ జీవితాన్ని తలకిందులు చేసింది. అప్పటి నుంచి చనిపోయే వరకు ఈయన కెరీర్ డైలమాలోనే ఉంది.
ఇదిలా ఉంటే ఈయన చివరి సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దాని పేరు చిత్రం చెప్పిన కథ. ఈ సినిమా రిలీజ్ తర్వాత తన కెరీర్ గాడిన పడుతుంది అని అప్పట్లో ఉదయ్ కిరణ్ కొంతమందితో చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అనుకోని కారణాలతో అప్పట్లో వాయిదా పడింది. ఉదయ్ చనిపోయిన తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఈ సినిమాను ఇప్పుడు డిజిటల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. నిజానికి 2020 ఫస్ట్ వేవ్ లో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ రేటు వర్కౌట్ అవ్వకో ఇంకా ఏదైనా కారణాల వలనో డీల్ సెట్ కాలేదు.
కానీ ఇప్పుడు మళ్ళీ సెకెండ్ వేవ్ లో చాలా సినిమాలు డిజిటల్ లోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ కూడా ఎలాగైనా డిజిటల్ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి కష్టంగా అభిమానులు కూడా చూస్తారని నమ్ముతున్నాయి ఓటిటీ సంస్థలు. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట.